న్యూఢిల్లీ: వ్యక్తులు వ్యాపారులకు జరిపే యూపీఐ చెల్లింపులపై ప్రభుత్వం చార్జీలు వేయగా, ఈ చార్జీలపై మరో 18 శాతం జీఎస్టీ పడుతుందని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ స్పష్టం చేశారు. అయితే రిజిస్టర్డ్ వ్యాపారులు దీనిపై ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేసుకోవచ్చని, దీనివల్ల పన్ను భారం చాలావరకు తగ్గుతుందని తెలిపారు. జీఎస్టీ అనేది మొత్తం బిల్లుపై కాకుండా, కేవలం బ్యాంకులు వసూలు చేసే 0.4శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) సర్వీస్ చార్జీపై మాత్రమే పడుతుంది. ఉదా. రూ.3 వేల లావాదేవీకి రూ.12 ఎండీఆర్ అయితే, దానిపై 18శాతం జీఎస్టీ అంటే రూ.2.16 పడుతుంది. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్న వ్యాపారులు తాము చెల్లించిన 18శాతం పన్నును కస్టమర్ల నుంచి సేకరించిన అవుట్పుట్ ట్యాక్స్లో సర్దుబాటు చేసుకోవచ్చు. అంటే ప్రభుత్వం కోసం కస్టమర్ల నుంచి సేకరించిన జీఎస్టీలో తాను ఎండీఆర్పై కట్టిన 18 శాతం జీఎస్టీని కట్ చేసుకొని, మిగిలిన అమౌంట్ను ప్రభుత్వానికి చెల్లించొచ్చు.
